
నాకు తెలిసిన బాలగోపాల్ అంటే బాలగోపాల్ గారు నాకు పరిచయమున్నారని కాదు, నేను తెలుసుకున్న బాలగోపాల్ గురించి కొంత చెప్పాలని చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాస్తున్నాను.
ఆయనని నేనెప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు కానీ మా నాన్నగారి ( గణపతి రావు నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య(APTF) ) ద్వారా ఆయనగురించి చాలా విషయాలు తెల్సుకున్నాను. మానవ హక్కుల ఉద్యమంలో ఇరువురూ పనిచేస్తున్నప్పటికీ మానవహక్కుల పట్ల ఆయన నిబద్ధత కొన్ని విషయాలలో ఆయన అతని సహచరులని కూడా విభేదించేట్లు చేసేది.
శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నది పైన మడ్డువలస ప్రాంతంలో ఒక రిజర్వాయరు స్థాపనకి ప్రభుత్వం శంకుస్థాపన చేసి, దాదాపు రెండున్నర దశాబ్ధాలు ఆ ప్రతిపాదనని గాలికొదిలేసింది. ఆ రిజర్వాయరు నిర్మాణం పూర్తికాక ఆయకట్టు కింద ఉన్న (ఉండవల్సిన) దాదాపు నలభైవేల ఎకరాలు ఎండిపోయే పరిస్థితిలో అక్కడ రైతులు SUCI పార్టీ ( Socialist Unity Centre of India ) నాయకత్వం కింద ఒక ఉద్యమం చేపట్టారు. రైతులు, SUCI నాయకత్వం కలిసి మడ్డువలస రిజర్వాయరు సాధన పోరాట కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. ఆ కమిటీకి కామ్రెడ్ రమేష్ పట్నాయక్ (All India Democratic Students Organization మాజి రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ ఉద్యమకారులు, మేధావి. ప్రస్తుతం ప్రొ.హరగోపాల్ వంటి వారితో కలిసి విద్యా పరిరక్షణకు, మానవ హక్కుల కొరకు ఉద్యమిస్తున్నారు ) గారు కన్వీనర్ గా , మా నాన్నగారు జాయింట్ కన్వీనర్ గా ఉండేవారు.
సాధన కమిటీ సంవత్సరాలుగా చేపట్టిన అందోళనలు విజయవంతమయ్యాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడ్డువలస వచ్చి థొంభై కోట్లు(అప్పటికి ప్రోజెక్టు అంచనా వ్యయం 120 కోట్లకి చేరింది) కేటాయించారు. నిధులు సక్రమంగా వినియోగమయ్యేట్లు చూడండంటూ సభా వేదికమీదే ఉద్యమాన్ని నడిపించిన నాయకులని పిలిచి బాధ్యతలు అప్పగించారు.
వందలాది గ్రామాల రైతుల విజయం సరే.. ముంపు గ్రామాల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు. నిజానికి అక్కడ ముంపు వలన నష్టపోయేది కేవలం మూడు గ్రామాలు మాత్రమే. వారు ఎంత గొంతు చించుకున్నా వందలాది గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రొజెక్టు నిర్మాణాన్ని ఆపలేరు. ఇలాంటి సమయాలలో బాధితుల తరపున మాట్లాడే కమ్యూనిష్టు పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు రైతుల తరపున ఉద్యమంలో పాల్గోవడంతో వాళ్ళ ఆందోళనని బాహ్యప్రపంచానికి వినిపించే నాథుడే కరువయ్యాడు.
అలాంటి పరిస్థితిలో, లక్షలమంది ప్రయొజనాలు ఉన్నప్పటికి కొన్ని వేలమంది బ్రతుకుల్ని బలి చేయడం తగదని బాలగోపాల్ గారు నిర్వాసితుల తరుపున ఉద్యమానికి పూనుకున్నారు. ఆ రొజుల్లో ఉధ్రుతంగా సాగుతున్న నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్ కూడా మడ్డువలస నిర్వాసితుల తరుపున ఉద్యమించారంటే అది కచ్చితంగా బాలగోపాల్ గారి ఘనతే. నిజానికి ఇక్కడి విశేషమేమంటే కామ్రెడ్ రమేష్ పట్నాయక్ గారు, మా నాన్న గారు బాలగోపాల్ గారికి ఎన్నో ఉద్యామాలలో సహచరులు. చివరికి బాలగోపాల్ గారి కృషి వలన నిర్వాసితులకి కొత్తగా గ్రామాలు నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం.
బాలగోపాల్ గారు అస్థమించాక ఆయన గురించి పత్రికలలో రాస్తూ ఆయన నక్సలైట్ ఉద్యమాలు కూడా మానవహక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నాయని, అందుకే ఆయన పౌర హక్కుల ఉద్యమం నుండి బయటికొచ్చి మానవ హక్కుల వేదికని ఏర్పాటుచేసారని పేర్కొన్నాయి. నాకు తెల్సినంతవరకు ఆయన ఒక సంఘం అనుసరిస్తున్న విధానాలని విభేదించి మరొక సంఘం మాత్రమే పెట్టుకున్నారు. రెండు సంఘాలలోనూ ఆయన కృషి చేసింది మానవహక్కుల కోసమే. శ్రీ శ్రీ గారు అరసం(అభ్యుదయ రచయితల సంఘం) లో ఇమడలేక విరసం(విప్లవ రచయితల సంఘం) అంకురార్పణకి ఎలా కృషి చేసారో అదేవిధంగా బాలగోపాల్ గారు కూడా మానవహక్కుల వేదిక స్థాపనకి కారణమయ్యారు.
